Feeds:
టపాలు
వ్యాఖ్యలు

ఈ ప్రశ్న పురాణకాలం నుంచీ అడుగుతున్నదైనా ఈనాటికీ సమాధానం మాత్రం దొరకలేదు. రోజులు మారాయి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటున్న ఈ రోజుల్లో నిప్పుల కొలిమిలో నిలువునా కాలిపోతున్న మహిళలు ఇంకా ఎందరో వున్నారు. ఉదాహరణ నా స్నేహితురాలి కధే. నా చిన్ననాటి స్నేహితురాలి జీవితం పెళ్ళి అయిన మూడునాళ్ళకే కన్నీళ్ళ పర్యంతం అయింది. తన పెళ్ళి అయిన నెల లోపే నేను విన్న మొదటి వార్త తను భర్తని వదిలి వచ్చేసిందని. నేను షాక్ తో తనకి ఫోన్ చేసినపుడు తన భర్త ప్రవర్తన నచ్చకే వచ్చేసాననీ ఇంకేమీ అడగద్దనీ అనటంతో నేను మరేమీ మాట్లాడలేకపోయాను. కొద్ది రోజుల గడువు తరువాత నేను మరొకసారి తనతో మట్లాడటానికి ప్రయత్నిస్తే నా స్నేహితురాలి అమ్మగారు ఫోన్ తీసారు. నేను నా స్నేహితురాలి గురించి వాకబు చేయగానే, ఆవిడ తన కూతురుకు తనకు ఏ సంబంధం లేదనీ, భర్తను వదిలి వచ్చిన దానితో ఎవరూ మాట్లాడమనీ చెప్పి ఒకటే చీవాట్లు నా స్నేహితురాలిని. ఆఖరికి వాకబు చేయగా తను వేరే వూరిలో వుండి చదువుకుంటోందని తెలిసింది. పోనీలే మనసు మరొకదానిపైన మళ్ళించి మంచిపని చేసిందని అనుకున్నా, “ఇంత తొందరపాటు పని ఎందుకు చేసింది? కొద్ది రోజులు భర్త ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసి ఉండచ్చు కదా!” అని నా మనసులో అనుకోకుండా ఉండలేకపోయాను. అలా ఒక సంవత్సరం గడిచింది. నేను వీలు దొరికినపుడల్లా నా స్నేహితురాలి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నాను. తను చదువును కొనసాగిస్తూ, కాలాన్ని వృధా చేయకుండా ఎవరి అండ దండా లేకుండా గడుపుతుంటే తన గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కానీ మనం సంఘం మధ్య, కట్టుబాట్ల సంకెళ్ళ మధ్య ఉన్నామని, అవి మన బతుకు మనల్ని బతకనివ్వవని ఆ క్షణం మరిచాను.  

      ఒక రోజు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తను తన భర్త దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పింది. రేపో మాపో విడాకులు తీసుకోవాలనుకుంటున్న తనలో ఈ మార్పు ఏమిటని అశ్చర్యం వేసింది. తన నిర్ణయం వెనుక తన తల్లితండ్రుల ఒత్తిడి చాలా వుందని, వారు తన వల్ల బయట ఎవరికీ మొహం చూపించలేకపోతున్నారనీ పైగా వారి అండ లేకుండా తను ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండగలననీ అంది. తన భర్త కూడా తన రాకకు సరే అన్నాడనీ అంటే పోనీలే అంతా తన మంచికే జరిగిందని అనుకున్నా. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి సుఖంగా ఉందని అనుకుంటున్న సమయం లో మరొకసారి తనకి ఫోన్ చేస్తే, తన కొత్త జీవితం ఎలా ఉందని అడిగితే, ఆమె సమాధానం ‘నరకం’ లా ఉందని. తన భర్త ఏ మాత్రం మారలేదనీ, అతనికి లేని దురలవాటు లేదనీ, శారీరకంగా మానసికంగా హింసననుభవిస్తున్నాననీ అంటే గుండె తరుక్కుపోయింది. ఆమెని తిరిగి కాపురానికి రమ్మన్నది కట్నం వెనక్కి ఇవ్వాల్సి వస్తుందన్న కారణం చేతనేననీ అన్నది. పోనీ ఈ నరకం నుంచి వెళ్ళిపోదామంటె తన తల్లితండ్రులు ఛస్తామని బెదిరించటం వల్ల వేరే దారి తనకు లేదని అంటే నా చిన్ననాటి స్నేహితురాలి కోసం ఏమీ చేయలేని అశక్తురాలినై పోయాను. ఆమె తల్లి తో మాట్లడితే ప్రయోజనం ఉంటుందనుకుంటే, కూతురు ఏమైపొయినా ఫరవాలేదు కానీ తనకి పరువే ముఖ్యం అనే ఆమె సమాధానానికి ఆమెని నిందించాలో లేక ఆమెనలా మార్చిన లోకాన్ని నిందించాలో తెలీక మరోసారి అశక్తురాలినైపోయాను. ఉన్నత చదువు చదివీ తన బతుకు తను బతకలేక, భర్త కాళ్ళ కింద పడుండమని తల్లే చెప్తుంటే మౌనంగా రోదిస్తున్న నా స్నేహితురాలి జీవితం ప్రతి క్షణం కళ్ళ ముందు మెదులుతుంటే, కట్టుబాట్లని, సంఘాన్ని అసహ్యించుకోవటం తప్ప మరేమి చేయగలను. ఎంతమంది వీరేశలింగాలు పుట్టినా, ఎంతమంది గాంధీలు పుట్టినా, మారని సంఘం, లోకులు, ‘స్త్రీ కి స్త్రీ యే శత్రువు’ అనే మాటని నిజం చేస్తున్న తోటి స్త్రీ లు ఉన్నంతవరకూ స్త్రీ స్వాతంత్ర్యం మాత్రం కలలో మాటే. 

అమ్మ

ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’

నేనూ, నా బ్లాగ్

నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,

వసుంధర. 

నా భావాలు

ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు

ఈ మధ్య శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలయ్యాక అన్ని వెబ్ సైట్ల లోను ఒకటే మాట. సినిమా ‘ఏ’ సెంటర్ల లోనే బాగా ఆడుతోందని, ‘బి’, ‘సి’ సెంటర్ల వాళ్ళకి గాంధీయిజం పట్టలేదని ఆన్ లైను పత్రికలన్నీ కోడై కూసాయి. ప్రతి చెత్త సినిమానీ పొగిడేసే పత్రికల వాళ్ళు ఈ సినిమానికి మాత్రం ‘3’ రేటింగు ఇవ్వటం ఇవన్నీ చదివి కొద్దిగా మనసు కలత చెంది ఇది రాస్తున్నాను. పత్రికల వాళ్ళ సంగతి వదిలేస్తే నా వరకు నాకు సినిమా బాగా నచ్చింది. ఈ మధ్యన ఇలాంటి మంచి సందేశాలు వున్న సినిమాలు కరువైపోయాయి.  సరదాగా సాగిపోతూ అంతర్లీనంగా సందేశాన్ని నింపుకుని గాంధీ సిద్ధాంతాలని గాడ్సే కి కూడా అర్ధం అయ్యేలా అరిటిపండు వలిచి చెప్పినట్లుగా ఈ సినిమాలో చెప్తే ఇది ఎందుకనో మాస్ కి అర్ధం కాలేదట. ఇది పత్రికల వాళ్ళ భ్రమా లేక నిజంగానే మాస్ కి ఇది అర్ధం కాలేదా? మరి డబుల్ మీనింగ్ డైలాగులు చాలా సులువుగా అర్ధం చేసుకునే ఈ మాస్ అనబడే ప్రజానీకం రెండే రెండు మాటలైన సత్యం, అహింస అనే పదాలని అర్ధం చేసుకోలేకపోయారంటే ఇది నిజంగా సిగ్గు చేటు.

ఆనాడు గాంధీ గారి పిలుపుతో యెంతో మంది విద్యాధికులు వున్న వుద్యోగాలు, ఆస్థిపాస్థులు, అన్నీ   వదిలేసి స్వాతంత్రం కోసం వెళ్తే, వేల మంది చదువు రాని ప్రజలు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర సమర బావుటా ఎగురవేయటానికి జైళ్ళకు కూడ వెళ్ళారు. వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు, మన భాషలో చెప్పాలంటే మాస్, క్లాస్ అందరూ వున్నారు. చదువు రాకపొయినా తాము వెర్రి గొర్రెలం కావని,  వుద్యమాలతో బ్రిటీషు వారికి యుద్ధానికి ఆయుధాలు అఖ్ఖర్లేదని అహింస, సత్యగ్రహమే చాలని కొత్త అర్ధం చెప్పిన భారత ప్రజలు అదే గాంధియిజాన్ని మరో అరవయ్యేళ్ళ తర్వాత చెప్తే అర్ధం చెసుకోలేకపొయారా? రోజు రోజు కీ తెలివితేటలు పెంచుకుంటూ, ప్రపంచంతో పరుగెట్టే ఈనాటి ప్రజలకి సులువైన మహాత్ముని మాటలు చెవినపడలేదా లేక యానా గుప్తా వంపుసొంపులతో, పాటతో కళ్ళు, మనసూ రెండూ మూసుకుపోయాయా? అదే గనుక జరిగితే విశ్వకవి రవీంద్రుడన్నట్లు, “ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ఆ స్వేఛ్ఛా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు” అని ప్రార్ధించటం తప్ప చేయగలిగేదేముంది?